
‘‘గోలీమార్ చేస్తున్న సమయంలో... నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని పూరీజగన్నాథ్ అడిగారు. మంచి కథ కోసం చూస్తున్నానని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత పూరీ నుంచి ఫోన్ వచ్చింది. ‘నీ దగ్గరకు ఓ వ్యక్తిని పంపుతున్నాను. అతని దగ్గర మంచి కథ ఉంది.

నేను విన్నాను. చాలా బాగుంది. ఓ సారి విను’ అని చెప్పారు పూరీ. కట్చేస్తే... రవి నా దగ్గరకు వచ్చాడు. ఈ కథ చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. వెంటనే పూరీకి థ్యాంక్స్ చెప్పాను. అనుకున్న దాని కంటే చక్కగా సినిమాను తీశాడు. ఈ సినిమాను కొనుక్కున్న వారందరూ హ్యాపీగా ఫీలవుతారని నా నమ్మకం.
నిర్మాత ఆనంద్ప్రసాద్గారితో నాకిది రెండవ సినిమా. శౌర్యం చిత్రాన్ని మించేలా ఈ సినిమా ఉంటుంది’’ అని గోపీచంద్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా, బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో వెనిగళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వాంటెడ్’. చక్రి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్బంగా గోపీచంద్ పై విధంగా స్పందించారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు రామ్గోపాల్వర్మ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న రవి మంచి సినీ విమర్శకుడు.
మేం తీసిన సినిమాల్లో లోపాలను కరక్టుగా ఎత్తిచూపించేవాడు. కాబట్టి తన సినిమాను జాగ్రత్తగా తీసుంటాడని భావిస్తున్నాను. పాటలు బాగున్నాయి. తప్పకుండా సినిమా విజయం సాధించాలి’’ అని చెప్పారు. గోపీచంద్ ఇలాగే ఓ పదిమంది ద ర్శకులను పరిశ్రమకు పరిచయం చేయాలనీ, రవి తప్పకుండా సక్సెస్ సాధించాలని మరో అతిథి పూరీ జగన్నాథ్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మొన్నటిదాకా రైటర్ని. ఇప్పుడు దర్శకుడ్ని అయ్యాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
నా అభిమాన దర్శకుల సమక్షంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. చక్రి అద్భుతమైన సంగీతం అందించారు’’ అన్నారు. ఆడియో సీడీని ప్రభాస్ ఆవిష్కరించి శాసనసభ్యురాలు, నటి జయసుధకు అందించారు. ఇంకా శ్రీను వైట్ల, రానా, దీక్షాసేథ్, పోకూరి బాబూరావు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.బ్రహ్మానందం, చంద్రసిద్దార్థ్, భగవాన్, రసూల్ ఎల్లోర్, భాస్కరభట్ల, ఎడిటర్ శంకర్, స్మిత, కల్పన తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం పాటలు విడుదలయ్యాయి.